నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

  • దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు
  • 2019లో ప్రకాశ్ రాజ్‌పై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు
  • కోర్టు పలుమార్లు సమన్లు పంపినా స్పందించని ప్రకాశ్ రాజ్
  • కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్

ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విమర్శకుడు ప్రకాశ్ రాజ్ చుట్టూ వివాదం నెలకుంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో ఆయనకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరులోని 48వ ఏసీజేఎం (ACJM) కోర్టు శనివారం ప్రకాశ్ రాజ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చింది.


వివరాల్లోకి వెళితే... ప్రకాశ్ రాజ్‌కు ఒకే సమయంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో తొలిసారి ఫిర్యాదు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.


ఈ అక్రమ ఓట్ల వ్యవహారంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు న్యాయవాది ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రైవేట్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం గత కొన్ని విచారణలుగా కోర్టుకు స్వయంగా హాజరుకావాలంటూ ప్రకాశ్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. 


అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాశ్ రాజ్ వరుసగా కోర్టు విచారణలకు గైర్హాజరవుతూ వచ్చారు. కోర్టు సమన్లను లైట్ తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి... ఈసారి ఆయనకు ఎలాంటి బెయిల్ దొరకకుండా నేరుగా నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Prakash Raj
Non bailable warrant
Multiple voter ID cards
Bengaluru ACJM court
Representation of the People Act
Voter registration fraud

More Telugu News